రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైసీపీ ప్రభుత్వం వేటు వేసింది. . దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకున్నట్టు… ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే జగన్ మాత్రం సొంత కక్షలు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. తాము అనుకున్నట్టు స్థానిక ఎన్నికలను జరపలేదనే కక్షతోనే ఎస్ఈసీ రమేశ్ పదవీకాలాన్ని తగ్గిస్తూ హడావుడిగా ఆర్డినెన్సును జారీ చేయడం దీనికి నిదర్శనమని చెప్పారు. కక్షపూరిత చర్యలు మాని కరోనాపై దృష్టిని సారిస్తే బాగుంటుందని తెలుపుతూ సుజనా వరుస ట్వీట్లు చేశారు.