హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. జూన్ 5న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లతో మల్టీప్లెక్స్లలో సినిమా విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హవీష్, అభిషేక్ నామా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, పూజితా పొన్నాడ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ.. ‘‘రెండు నెలలకు ఒకసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నేను నటించిన సినిమాలు అన్ని విడుదలవుతున్నాయి. అన్నిటిలో ఈ ‘సెవెన్’ చాలా స్పెషల్. ఇందులో రమ్యగా నటించాను. ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా చేసిన, నాకు నచ్చిన క్యారెక్టర్. డీసెంట్ సిటీ అమ్మాయిగా కనిపిస్తా. సినిమాలో రమ్య పాత్రకు చాలా వెయిట్ ఉంది. పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే హోమ్లీగా, ఇన్నోసెంట్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ‘రమ్య పాత్ర మీరే చేయాలి’ అని రమేష్ వర్మగారు పట్టుబట్టారు. కథ విన్న తరవాత క్యారెక్టర్ వదులుకోవాలని అనిపించలేదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్, సినిమా ఇచ్చిన రమేష్ వర్మగారికి థ్యాంక్స్. ఈ సినిమా కంటే ముందు నిజార్ షఫీ నా ఫ్రెండ్. తను దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. నన్నే కాదు, నాతో పాటు సినిమాలో నటించిన హీరోయిన్లు అందరినీ అందంగా చూపించాడు. అందుకు నిజార్ షఫీకి థ్యాంక్స్. హవీష్ లవ్లీ కోస్టార్. మంచి వ్యక్తి. తనతో పని చేయడం మంచి అనుభూతి. వాళ్ళ నాన్నగారు, ఫ్యామిలీ సినిమాలో నటించిన హీరోయిన్లు అందరినీ బాగా చూసుకున్నారు. విడుదలకు ముందు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇది. ప్రతి ఫ్రేములో ఒకే హీరోయిన్ కనిపిస్తే కొంతమంది ప్రేక్షకులకు బోర్ కొట్టొచ్చు. మా సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. సో, బోర్ కొట్టదు” అన్నారు.