తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్ మార్గ్ నివాసంలో ఉంచారు.
ఈ క్రమంలో CDS బిపిన్ రావత్కు చివరిసారిగా కన్నీటి నివాళులర్పిస్తున్నారు ప్రముఖులు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంపీలు కనిమొళి, నవనీత్ కౌర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్తో పాటు పలువురు సీఎంలు, ప్రముఖులు, ఆర్మీ అధికారులుతదితరలు శుక్రవారం రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు.
బిపిన్ రావత్ దంపతుల పార్థివ దేహాలను ఢిల్లీలోని వారి స్వగృహంలో ఉదయం 11 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం వరకు అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు
నిరంతరం దేశ రక్షణ కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి బిపిన్ రావత్. దేశానికి తొలి త్రివిధ దళాధిపతిగా సేవలందించిన రావత్..ఇక కనిపించరని తలుచుకొని విషాదంలో మునిగిపోయింది యావత్ దేశం .