మాజీ సీఎం చంద్రబాబు పై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని పేరిట అక్రమాలకు పాల్పడింది టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆర్కే ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టు ఆధారాలతో సహా నిరూపించామని చెప్పారు.
దళితుల భూములను కాజేసిన చంద్రబాబు, వాటిని బినామీలకు కట్టబెట్టారని అన్నారు. నీరుకొండలో తాను ఐదు ఎకరాల భూమిని కొన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త బినామీ అని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో కరకట్ట వద్దకు వెళ్లి చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు దోపిడీని సమర్థిస్తూ, అమరావతిలో పవన్ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలో జనసేన ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.