ఏపీ సీఎం జగన్ ను మెఘస్టార్ చిరంజీవి తొలిసారి కలవబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలో వారిద్దరు భేటీ కానున్నారు. వీరిద్దరూ మధ్యాహ్న భోజనాన్ని కలిసే చేస్తారని తెలుస్తోంది. ఈ కలయిక మర్యాద పూర్వకమేనని, ఎటువంటి రాజకీయ కారణాలు లేవని అటు సీఎంఓ అధికారులు, చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు.అయినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ భేటీ పై జోరుగా చర్చ జరుగుతోంది. తాను నటించిన ‘సైరా’ చిత్రాన్ని వీక్షించాలని జగన్ ను కోరేందుకే చిరంజీవి వస్తున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ నటీ నటులకు ఇష్టం లేదని, అందుకే ఆయన్ను ఎవరూ కలవలేదని ఇటీవలి కాలంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులకు జగన్ అంటే ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లంచ్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ ను కలిసే నిమిత్తం చిరంజీవి ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు.