మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు గురువారం దక్షిణ మెక్సికోలోని హైవేపై బోల్తాపడి పాదచారుల వంతెనపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 53 మంది వలసదారులు మరణించారు. 54 మంది గాయపడ్డారు…
చియాపాస్ రాష్ట్ర పౌర రక్షణ ఆఫీస్ అధికారి లూయిస్ మాన్యువల్ మోరెనో మాట్లాడుతూ.. 53 మంది మరణించారని, క్షతగాత్రుల్లో 21 మంది తీవ్రంగా గాయపడ్డారని ..వారందరినీ స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చియాపాస్ రాజధాని వైపు వెళ్లే ఓ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
ఆ వాహనంలో కనీసం 105 మంది ఉన్నారు. గాయపడిన వారిలో 83 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారని తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
బాధితులు సెంట్రల్ అమెరికా నుండి వలస వచ్చిన వారిగా తెలుస్తోంది. ప్రాణాలతో బయటపడిన వారిలో కొందరు పొరుగు దేశమైన గ్వాటెమాలాకు చెందిన వారని సమాచారం.