మరోసారి జపాన్ దేశాన్ని తుఫాన్ భయబ్రాంతులకు గురిచేస్తుంది. తాజాగా ‘టైఫూన్ హగిబీస్’ తుపాన్ ముంచెత్తడంతో 72 మంది మృత్యువాత పడ్డారు. జపాన్ దేశాన్ని కుదిపేసిన ఈ తుపాన్ ప్రభావం వల్ల 9,962 ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. భారీవర్షాల వల్ల జపాన్ దేశంలో వెల్లువెత్తిన వరదలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల నుంచి 2,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాన్ విపత్తు వల్ల 72 మంది మరణించడంతోపాటు రవాణ, పర్యాటక రంగాలకు భారీనష్టం వాటిల్లింది. ఇజు పెనిన్సులా, టోక్యో పరిసర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం వల్ల భారీ నష్టం వాటిల్లింది. తుపాన్ సహాయ పనులు చేపట్టేందుకు 1,10,000 మంది అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసు, సెల్ఫ్ డిఫెన్స్ బలగాలను వరద ముంపు ప్రాంతాలకు పంపించారు. 110 హెలికాప్టర్లను రంగంలోకి దించి తుపాన్ సహాయ పునరావాస పనులు చేపట్టామని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యషీహిదీ సుగా చెప్పారు.