telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

సిమెంట్ లారీ లో .. 2 కోట్లు పట్టుకున్న .. ఈసీ

ప్రచారం పూర్తికావడంతో అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని గంటలలో ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టే పధకాలు నేతలు బాగానే వేస్తున్నారు. వారి ప్రయత్నాలకు హద్దుపొద్దు లేకుండాపోయింది. తాజాగా ఏపీలో ఎలాగైనా ఓట్లను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో భారీగా డబ్బులను పంచేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్న వేళ, ఈసీ, పోలీసుల సంయుక్త బృందాలు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 
విజయవాడ, ఎనికేపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళుతున్న లారీలో రూ. 1.95 కోట్లు పట్టుబడ్డాయి. సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీని ఆపిన పోలీసులకు, సిమెంట్ లోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందన్న పత్రాలు లభ్యం కాకపోవడంతో తనిఖీ చేయగా, భారీ ఎత్తున డబ్బు కనిపించింది. రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సిమెంట్ బస్తాల మధ్య పెట్టి తీసుకుని వెళుతుండగా అధికారులు గుర్తించారు. ఈ డబ్బును కంచికచెర్ల నుంచి ఏలూరుకు తీసుకెళుతున్నారని గుర్తించిన తనిఖీ సిబ్బంది, ఇది ఎవరిదన్న కోణంలో విచారణ ప్రారంభించారు. లారీని పటమట పోలీసు స్టేషన్ కు తరలించారు.

Related posts