తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) ప్రస్తుత వేసవిలో ఎండలు మండుతున్నందున ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి వినతిపత్రం అందజేసింది.
అనంతరం కోఠిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. కర్నాటక రాష్ట్రంలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వాలు కార్యాలయాల పని సమయంలో మార్పులు చేసినట్లు తెలిపారు.
మే 1నుంచిరెండు నెలల పాటు రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్న పని సమయాల నుంచి ఉద్యోగులకు మినహాయింపునిచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యాలయాల పని సమయాలను మార్చాలని తాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ మెసా అదనపు ప్రధాన కార్యదర్శి తాపీక్ ఉర్ రహ్మాన్, కార్యదర్శి అలీం తదితరులు పాల్గొన్నారు.