సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా కలెక్టర్ ఛోటే సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఛోటే సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులను సత్కరించేందుకు ప్రిన్సిపల్ పూల మాలలు తీసుకొచ్చారు. అయితే, ఆ పూలను పాలిథిన్ కవర్లతో తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ కు రూ. 1000 జరిమానా విధించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, పూలమాలలను సింగిల్ యూజ్ కవర్లలో తీసుకొచ్చారని, తాగు నీటిని కూడా సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ ద్వారానే అందించారని చెప్పారు. వందలాది మంది విద్యార్థులు ఉన్న చోట ఇలాంటి పనులు చేయడం సరికాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికే తాను అలా చేశానని తెలిపారు.