తెలంగాణ రాష్ట్రానికి ఆర్.సి.కుంతియా అనే ఐరన్లెగ్ను ఇన్చార్జిగా నియమించినందువల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ‘ఉత్తమ్, కుంతియాకు హఠావో… కాంగ్రెస్కు బచావో’అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతోఆయన మాట్లాడుతూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై సమీక్ష ఎవరు చేయమన్నారని ప్రశ్నించినందుకే తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. తనపైకి వచ్చిన వారికి గట్టిగానే సమాధానం చెప్పి తాను సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు.
తనను సస్పెండ్ చేశామని టీపీసీసీ చెబుతోందని, ఏఐసీసీ సభ్యుడినయిన తనను సస్పెండ్ చేసే అధికారం వీళ్లకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయాలని అధిష్టానం చెబితే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎక్కడ ఉందని నిలదీశారు.గత ఎన్నికల్లో తనను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వివరాలన్నింటితో త్వరలోనే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు.