వెయ్యి కోట్ల విలువైన సచివాలయాన్ని బుల్ డోజర్లతో కూలగొట్టించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తన మూఢనమ్మకాలకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో ఉన్న ఏ భవనాన్ని కూడా 35 సంవత్సరాలకు మించి వినియోగించలేదని స్పష్టం చేశారు. ఏవైనా ప్రభుత్వ భవనాలు నిర్మించాలనుకుంటే, 100 సంవత్సరాలు ఉండేలా నిర్మిస్తారని తెలిపారు.
ప్రస్తుతమున్న సచివాలయంలో అన్ని అత్యాధునిక సౌకర్యాలు, అధికారులందరికీ అవసరమైన వసతులు ఉన్నాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ విభజన సందర్భంగా ఏపీకి 5.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న సచివాలయం లభిస్తే, తెలంగాణకు దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్థలం లభించిందన్నారు. కేసీఆర్ ఏ ప్రాజెక్టు మొదలుపెట్టిన అంచనాలు భారీగా పెరిగిపోతాయని అన్నారు.