సెంట్రల్ ట్రేడ్ యూనియన్ బిల్లు 2018కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రెండు రోజులు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు మంగళవారం తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కులో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా నేడు, రేపు జరగబోయే ఈ సార్వత్రిక సమ్మెలో 12 డిమాండ్లను కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రస్తావించనున్నారు.
కాంట్రాక్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల సవరణ ఆపాలి తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ బంద్లో బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు, రేపు బ్యాంకుల్లో వాదేవీలు నిలిచిపోనున్నాయి. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 బిల్లు ఆమోదం పొందితే కార్మిక సంఘాల అధికారాలకు తెరపడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.