ఏపీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాఖలవారీ సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెవెన్యూ, ఆర్థిక శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్.. ఇవాళ ఉదయం విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉదయం 10గంటలకు సమీక్ష ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో విద్యా విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే పాఠశాల విద్యలో సంస్కరణలు చేయాలని జగన్ నిర్ణయించారు. విద్యార్థులకు ఉపశమనం కలిగించే దిశగా ముఖ్యమంత్రి అడుగేలుస్తున్నారు. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు చేసిన విషయం విదితమే. విద్యార్థులకు విద్యా భారం లేని పాఠ్య పుస్తకాల మోత బరువు తగ్గించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం నెలలో రెండో, నాలుగో శుక్రవారాల్లో విద్యార్థులు పుస్తకాల్లేకుండా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజుల్లో చిత్రాలు, ఎక్సర్సైజ్ సహా ఇతర పద్ధతుల్లో ఉపాధ్యాయులు బోధిస్తారు. పిల్లల్లో చురుకుదనం పెంపొందిస్తారు.
నేడు మధ్యాహ్నం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష జరగనుంది. మంగళవారం ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై, మధ్యాహ్నం గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష జరగనుంది. ఈ నెల 6న సీఆర్డీఏపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 7వ తేదీన (శుక్రవారం) వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరు కావాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. ఈ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల నిర్వహణ, తేదీలపై చర్చించి.. ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరిస్తారు. ఈ సమావేశంలోనే మంత్రివర్గ విస్తరణ ప్రకటన కూడా ఆయన చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 8న అసెంబ్లీకి సమీపంలో వేదికను ఏర్పాటు చేసి మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపడతారని చెబుతున్నాయి.