వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ .. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ కు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా పరోక్షంగా విమర్శలు చేశారు.
దుష్టచతుష్టయం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా పని గట్టుకొని ప్రచారం చేస్తోందని, వారికి తోడు దత్త పుత్రుడు (పవన్ కల్యాణ్) కలిశాడని ఎద్దేవా చేశారు.
వీరంతా కలిసి తమపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారని అన్నారు.గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మన గెలుపును అడ్డుకోవడం వారి వల్ల కాదు కాబట్టే రాక్షసులంతా ఒక్కటవుతున్నారని జగన్ విమర్శించారు. గెలుపు సాధ్యం కాదు కాబట్టే రాష్ట్రంలో కులాల కుంపట్లు.. మతాల మంట పెడుతున్నారని జగన్ అన్నారు
చంద్రబాబుకు ఉన్నట్లుగా మీడియా పత్రికలు తనకు అండగా నిలబడకపోవచ్చని, కానీ జనం ప్రేమాభిమానాలు అండగా ఉన్నాయని చెప్పారు.
వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు..మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్ అన్నారు.