telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎల్ఆర్ఎస్ పేరుతో కేసీఆర్ దోపిడీ: వివేక్

Ex-MP-Gaddam-Vivek

తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. నిరసనలో భాగంగా బీజేపీ శ్రేణులు సిద్ధిపేటలో ఇవాళ కలెక్టరేట్ ముట్టడి నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారంటూ మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజలను పీడించడానికే సర్కారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని విమర్శించారు.

కేసీఆర్ సర్కారు ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకుతింటోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కుటుంబ పాలన నశించాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు సిద్ధిపేట పీఎస్ కు తరలించారు.

Related posts