బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ కౌంటర్ వేశాడు. అటు ఒవైసీ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. 24 గంటల టైమ్ ఇస్తున్న సర్జికల్ స్ట్రయిక్ చేయాలని సవాల్ కూడా విసిరారు ఒవైసీ. అయితే.. దీనిపై తాజాగా రాములమ్మ కూడా స్పందించింది. సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలను సమర్థిస్తూ… టీఆర్ఎస్, ఎంఐఎంలను టార్గెట్ చేస్తూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” సర్జికల్ స్ట్రయిక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి?టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని… పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని… సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా? లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముంది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు. కాగా.. రాములమ్మ బీజేపీలో చేరుతున్నట్లు ఈ మధ్య జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
previous post