తెలంగాణలోని టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అక్రమాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనపై కేంద్రం నిఘా పెట్టడం శుభపరిణామమని ఆమె అన్నారు. కేసీఆర్ పాలనలోని అవకతవకలపై చర్యలు తీసుకునే రోజు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని అన్నారు. ఆ పేరుతో ఇంతకాలం ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని చెప్పారు. టీఆర్ఎస్ పెద్దలు వేసుకున్న ముసుగు తొలగిపోయి, వారి నిజ స్వరూపం బయటపడే రోజు వస్తుందన్నారు.
ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపణలతో సహా నిరూపించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలోని అవినీతిపై వివరాలు సేకరిస్తున్నామని కేంద్రం చెప్పడం శుభపరిణామమని విజయశాంతి పేర్కొన్నారు.