కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పూర్తిస్థాయిలో కొవిడ్-19 పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా రహిత జిల్లాగా ఎలా ప్రకటిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో దీనిపై స్పందించారు.
‘మీ ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో, కరోనాతో కాదు. టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు? అని ప్రశ్నించారు. టెస్టుల విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు. మీకు చేత కాదు, మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు!’ అంటూ ఉత్తమ్ కుమార్ విమర్శించారు.
సూర్యాపేటతో పాటు రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారో తెలపాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు నిన్న ఆదేశించింది. కరోనా పరీక్షలు ప్రాథమిక అనుమానితులకు చేసి, లక్షణాలు లేని రోగులకు చేయడం లేదంటూ సంకినేని వరుణ్రావు దాఖలు చేసిన పిల్ను నిన్న న్యాయస్థానం విచారించింది. ఇందుకు సంబంధించిన వార్తను ఉత్తమ్ పోస్ట్ చేశారు.