*టైలర్ షాపు నడుపుతున్న వ్యక్తి దారుణ హత్య
*ఒక్కసారి భగ్గుమన్న రాజస్థాన్
*రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్..
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హైటెన్షన్ నెలకొంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ను ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా చంపేశారు.
దుస్తుల కొలతలు ఇవ్వడానికొచ్చిన కస్టమర్ల రూపంలో షాపులోకి ప్రవేశించిన దుండగుల్లో రియాజ్ కత్తితో కన్హయ్య పీక కోస్తుంటే, అక్తర్ ఆ దారుణాన్ని వీడియో తీశాడు. పీక కోసిన వీడియోతోపాటు ఈ పని చేసింది తామేనంటూ మరో వీడియోను రూపొందించి, రెండిటినీ వాళ్లే వైరల్ చేశారు.
అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్ హత్యోదంతంతో ఉదయ్పూర్లోని మల్డాస్ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు.
ఈ ఘటనతో ఉదయ్పూర్ సిటీ భగ్గుమంది. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వం తొలుత ఉదయ్పూర్ లో కర్ఫ్యూ విధించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 అమలుకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు రాజస్థాన్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయ్పూర్ అంతటా దాదాపు 600 మంది పోలీసులను మోహరించారు. ఉదయ్పూర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
నిందితులను మహమ్మద్ రియాజ్ అక్తర్, మహమ్మద్ ఘోష్గా గుర్తించారు. ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా మృతుడి కుటుంబానికి జిల్లా యంత్రాంగం రూ.31 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది