స్నేహం ముసుగులో ఓ వ్యక్తిని నిండా ముంచాడో మరో వ్యక్తి. పెద్ద ఎత్తున ఆస్తులున్నాయని గుర్తించి తన మరదలిని ఎరగా వేశాడు. బాధితుడు తేరుకొని.. మోసపోయానని గుర్తించే సరికి ఆలస్యమైపోయింది. అతడి నుంచి అప్పటికే విడతలవారీగా రూ.1.2 కోట్లు వారు కొల్లగొట్టారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితుడు ఏపీకి చెందిన గుంటూరు వాసి సుబ్బారెడ్డి.
ఆయన భూస్వామి. తరచూ హైదరాబాద్కు వచ్చే అతడికి ఇటీవల నగరంలోని అంబర్పేటకు చెందిన సాయిరాం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సుబ్బారెడ్డికి కోట్లలో ఆస్తులున్నాయని తెలుసుకొని పెద్ద మొత్తంలో నగదు కొట్టేయాలని పథకం వేశాడు. ఇందుకు బాగ్ అంబర్పేట డీడీ కాలనీలో ఉంటున్న తన మరదలు అర్చన అలియాస్ సంజన అలియాస్ నిధితో పాటు.. ఆమె స్నేహితుడు అనిల్కుమార్ రంగంలోకి దింపాడు. సుబ్బారెడ్డి గురించి, అతడి అలవాట్లు, బలహీనతల గురించి వారికి చెప్పాడు.
సుబ్బారెడ్డిని అర్చన వాట్సాప్లో పరిచయం చేసుకుంది. రోజూ చాటింగ్ చేస్తూ అతడిపై వలపు వల విసిరింది. తనకు హైదరాబాద్లో బ్యూటీపార్లర్ ఉందని, ఆర్థిక సాయం చేయాలని కోరింది. అలా విడతల వారీగా సుబ్బారెడ్డి నుంచి రూ. 1.2 కోట్లు కొల్లగొట్టింది. కొద్దిరోజులు గడిచిన తర్వాత అర్చన ప్రవర్తనపై అనుమానం వచ్చిన సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.