ట్యూషన్ ఫీజు చెల్లించకుండా పరీక్ష ఫీజు తీసుకునేది లేదని ఓ విద్యార్థినికి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. తన ఏడాది చదువు వృథా అవుతుందని వారిని వేడుకున్నా యాజమాన్యం కనికరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బాగ్లింగంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే బృందావన్ కాలనీలో ఓ భవనంలో రాజేంద్ర ప్రసాద్, మాధవి దంపతులు అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుస్మిత (21) ఘట్కేసర్లోని ఏస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. ఆమె కాలేజీకిరూ.40వేల ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ ఫీజు చెల్లించిన తర్వాతే పరీక్ష ఫీజు తీసుకుంటామని సుస్మితకు కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన సుస్మిత మధ్యాహ్నం ఒంటిగంటకు భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.