ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలరెడ్డి నగర్ లో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మరణించగా.. చికిత్స పొందుతూ మరో కార్మికుడు కూడా తుది శ్వాస విడిచారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్టట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను స్థానికులు, పోలీసుల శ్రమించి బయటకు తీశారు.
మల్టీప్లెక్స్ సెల్లార్ నిర్మాణం పనులలో భాగంగా ఆ కార్మికులు రాడ్ బెండింగ్ వర్క్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 20 నుంచి 30 అడుగుల లోతు తీసిన పునాదిలోనే ఇనుప రాడ్లకు సంబంధించిన పనులు చేస్తున్నారు. అప్పుడు సుమారు 40 నుంచి 50 మంది కార్మికులు అక్కడ ఉన్నారని స్థానికులు చెప్పారు.
ఇనుప రాడ్లకు సంబంధించిన పనులు చేస్తున్న సమయంలో మట్టిపెళ్లలు కూలాయి. ఆ ఘటనలో ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తృటిలో తప్పుకున్నారు. ముగ్గురిపై ఎక్కువగా మట్టిపెళ్లలు పడ్డాయి. దీంతో ఈ ముగ్గురు మరణించారు.
సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారని బీహార్, బెంగాల్ కు చెందిన కూలీలుగా గుర్తించారు.
మరోవైపు ఈ ఘటనపై సైట్ ఇంజనీర్, టెక్నికల్ పర్సన్, బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది.