రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్షిప్ వద్ద ఇటీవల ప్రమాదానికి గురైన లగ్జరీ కారు హీరో తరుణ్ది అని, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి పారిపోయారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కారు ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు అల్కాపురి టౌన్షిప్ సర్కిల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా, కారులో నుంచి దిగి పారిపోయింది తరుణ్ కాదు, హీరో రాజ్ తరుణ్ అని తేల్చారు. ఈ కేసు మరోమలుపు తిరిగింది. కారు ప్రమాదం జరిగిన సమయంలో వీడియో తీసిన ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ పారిపోవడానికి ప్రయత్నించారని, తాను వెంబడించి పట్టుకున్నానని చెప్తు కార్తీక్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో రాజ్ తరుణ్ ఫుల్ గా మద్యం తాగి ఉన్నారని, మద్యం మత్తులో ఉన్న ఆయన తనతో వాగ్వాదానికి దిగారని కార్తీక్ తెలిపారు.
రాజ్ తరుణ్ ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రమాద సమయంలో తాను చిత్రీకరించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఇవ్వాల్సిందిగా రాజ్ తరుణ్కు సంబంధించిన వ్యక్తులు తనను డిమాండ్ చేస్తూ బెదిరించారని, ఫ్రూఫ్స్ ఇస్తే 5లక్షల రూపాయలు ఇస్తామన్నారని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద రాజ్ తరుణ్ మద్యం మత్తులో ఉండటం వల్లే కారు యాక్సిడెంట్ చేశారని..ఈ విషయం బయటకు పొక్కితే తన కుటుంబ పరువుతో పాటు తన ఇమేజ్ డామేజ్ అవుతుందని భావించి ఎదురు దాడికి దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కార్తీక్ను ప్రలోభ పెట్టి ప్రమాదానికి సంబంధించిన వీడియో బయట పడకుండా ప్రయత్నించారని, కుదరక పోవడంతో బెదిరింపులకు దిగుతున్నారని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రాజ్తరుణ్ కారు ఫుట్పాత్ పైకి దూసుకొచ్చి ఓ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఇంటికెళ్ళిన రాజ్ తరుణ్ మత్తు దిగిన తర్వాత యువతకు సోషల్ మీడియా ద్వారా రోడ్డు ప్రమాదాలపై ఓ వీడియోను విడుదల చేసి సందేశం ఇవ్వడం కొసమెరుపు.
తండ్రీ కొడుకులు శూన్య తెలంగాణ చేస్తున్నారు: వివేక్