ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ కోడెల పై ఆఘమేఘాల మీద కేసులు పెట్టి, లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలని జగన్ చూశారని మండిపడ్డారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడూ అంతులేని అవినీతికి జగన్ పాల్పడ్డారన్నారు. ప్రతి శుక్రవారమూ కోర్టు కేసులకు హాజరయ్యే జగన్, మచ్చలేని నేతగా ఉన్న కోడెలపై అసత్య ఆరోపణలతో బురద జల్లించి, ఆయన మనస్తాపానికి లోనయ్యేలా చేశారని నిప్పులుచెరిగారు.
కోడెల తీసుకెళ్లిన ఫర్నీచర్ విలువ లక్షా, రెండు లక్షలు కూడా కాబోదని, అది పాత ఫర్నీచరని, అది తీసుకెళ్లారని, అదే కోడెలకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఇప్పుడు జగన్, తాను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి, కోర్టు కేసులకు కూడా హాజరు కాబోనని అంటున్నారని విమర్శలు గుప్పించారు.తన వద్ద ఉన్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాలని కోడెల లెటర్ రాసిన తరువాత మాత్రమే, కేసులు నమోదు చేశారని అన్నారు. అది కూడా నరసరావుపేట ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రమే నమోదయ్యాయని, ఏ అధికారీ పెట్టింది కాదని అన్నారు. ఇలా కేసులు పెట్టి, ఓ మనిషిలో పిరికితనాన్ని డెవలప్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.