తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1078 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఆరుగురు కరోనాతో మృతిచెందారు. ఇదే సమయంలో 331 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819 కు చేరగా.. రికవరీ కేసులు 3,02,207 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1712 మంది మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్స్పై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచి 20 వరకూ ప్రాక్టికల్స్ జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పబ్లిక్ పరీక్షల తర్వాతే ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో థియరీ పరీక్షల తర్వాత మే 29 నుంచి జూన్ 7 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.