ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. పసుపు కుంకుమ కింద ఇప్పటికే రూ.10 వేలు అందించిన ప్రభుత్వం వారి సాధికారత కోసం మరో పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సొమ్ములో రూ.2500ను గత నెలలోనే అందించిన సర్కారు.. నేడు రెండో విడతలో భాగంగా మరో రూ.3500ను వారి ఖాతాల్లో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిహక్కును తీసుకొచ్చిన ఎన్టీరామారావు మహిళా సాధికారతకు బాటలు వేశారన్నారు. స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాల్లో మహిళలకు తాము 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పట్లో శాసనసభకు మహిళను స్పీకర్గా చేశామని, కేబినెట్లోనూ మహిళకు సముచిత స్థానం కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా ఇంకా వివక్ష కొనసాగడం విచారకరమన్నారు.