ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 178 మంది రైతులుపోటీపడిన విషయం తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర లభించని దుస్థితిని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతో ఇందూరు పసుపు రైతులు ఎన్నికల బరిలో దిగారు. రైతుల ప్రయత్నం మేనేజ్మెంట్ విద్యార్థులకు ఇకపై ప్రత్యేక పాఠం కానుంది. ఇందుకు అవసరమైన అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)ని కోరారు.
ఈ అంశంపై రజత్కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ లోక్సభ ఎన్నిక సప్లై చైన్ మేనేజ్మెంట్కు మంచి ఉదాహరణ. ఈ విభాగంలో ఇప్పటి వరకు భారత్లో బలమైన కేస్ స్టడీలు లేవు. అందువల్ల ఈ ఎన్నిక సరైన కేస్ స్టడీ అవుతుందని, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్న ఉద్దేశంతో అధ్యయనానికి ఆదేశించినట్లు తెలిపారు. ఐఎస్బీ అధికారులకు అవసరమైన సమాచారం అందిస్తామని తెలిపారు.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్