ఏపీకి ఇప్పటికే నలభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు దాటిపోయాయని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో సుమారు అరవై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అప్పులు చేయబోతోందని జోస్యం చెప్పారు. రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రానుందన్నారు.
అలాగే పెన్షన్లు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితిలోకి రాష్ట్రాన్ని జగన్ తీసుకెళతారని విమర్శించారు. పోలీసుల విచారణ ఆలస్యమైతే నేరస్తులు తప్పించుకుంటారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఘాటుగా బదులిచ్చారు. నేరస్తులు తప్పించుకుంటున్నారు కనుకనే జగన్ అంత నిర్భయంగా మాట్లాడారని దుయ్యబట్టారు. జగన్ పై ఉన్న కేసులు తరుముకొస్తుంటే, కోర్టుకు హాజరుకావడం లేదని విమర్శించారు.