ఏపీ రాజదాని అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిగా అమరావతి ఉండటం సీఎం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు. అమరావతిని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని మార్పుపై వస్తున్న వదంతులు, ఆరోపణలు, విమర్శలపై జగన్ తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేసిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని అన్నారు. రైతులను జగన్ ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే నాడు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చంద్రబాబు హయాంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జగన్ మాత్రం కులాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలను చీల్చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలను గౌరవించాలని సూచించారు. అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.