జర్మనీ, హోడెన్హాగన్ ప్రాంతంలో ఉన్న సెరెంగేటి సఫారీ పార్కులో ఓ ఖడ్గమృగం కోపంతో కారుపై దాడి చేసింది. దాడి జరిగిన సమయంలో కారులో ఓ మహిళ ఉంది. ఖడ్గమృగం దాడిలో గాయాలపాలైన మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అకస్మాత్తుగా ఖడ్గమృగం పార్కులో వెళ్తున్న కారు దగ్గరకు వచ్చి దాడి చేయడం మొదలుపెట్టింది. మూడు సార్లు కారును పల్టీలు కొట్టించింది. అదే పార్కులో సరదాగా వేరే కారులో వెళ్తున్న వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సఫారీ పార్కు అధికారులు స్పందించారు. దాడిని చేసిన ఖడ్గమృగం పేరు కూసిని అని.. దాని వయసు 30 ఏళ్లని తెలిపారు. ఇప్పటివరకు అది ఎవరిపై ఇలా దాడి చేయలేదని.. ఇప్పుడిలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కాలేదని అన్నారు. ఇకపై దాన్ని జూ లోపలే ఉంచనున్నట్టు పేర్కొన్నారు.