telugu navyamedia
రాజకీయ

కో-ఎడ్యుకేషన్‌ నిషేధించిన తాలిబన్లు

కాబూల్‌లో జెండా పాతిన తాలిబన్లు… తమ పాలనను మొదలు పెట్టారు. ఆంక్షలను ప్రారంభించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన మరుసటి రోజే హెరాత్ ప్రావిన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించారు. సమాజంలో అన్ని చెడులకూ మూలం కో-ఎడ్యుకేషన్‌ అని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రైవేటు వర్సిటీ యాజమానులు, తాలిబన్ నేతలతో 3 గంటలపాటు జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు అఫ్గాన్‌లోని ఖామా అనే న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. గతవారం అఫ్గాన్‌ను పూర్తిగా ఆక్రమించిన తర్వాత తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదేనని పేర్కొంది.

కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అఫ్గానిస్థాన్‌ ఉన్నత విద్యాధికారి తెలిపారు. మహిళా ఆచార్యులను మహిళా విద్యార్థుల బోధనకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కో-ఎడ్యుకేషన్‌ విధానానికి దీంతో తెరపడనుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు దెబ్బగా భావిస్తున్నారు. ప్రస్తుతం హెరాత్‌లోని విశ్వవిద్యాలయాల్లో 40వేల మంది విద్యార్థులు, 2వేల మంది ఆచార్యులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Related posts