పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పై హైకోర్టు తీర్పు జగన్కు చెంపపెట్టని దేవినేని వ్యాఖ్యానించారు.
పోలవరంలో పునాదే పడలేదని వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న ప్రాంతం నుంచి మొన్న లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిందని అన్నారు. అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ పోలవరం టెండర్లను నిలిపివేశారని విమర్శించారు. 2009లో పోలవరం స్పిల్ వే పనులను అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిపివేయించారని ఆరోపించారు. గతంలో టెండర్ల రద్దు వల్ల రూ.2,500 కోట్ల నష్టం వచ్చిందన్నారు. జగన్ తన అనుచరులకు విద్యుత్ ప్రాజెక్టు కట్టబెట్టేందుకే పోలవరం రివర్స్ టెండరింగ్కు వెళ్లారని దేవినేని ఆరోపించారు.