షేక్ సలాంబాబు ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. జీవో 127 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సలాంబాబు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థి, యువజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఎన్నో పోరాటాలు, ఉద్యమా లు నిర్వహించారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్ వంటి సమస్యలపై పో రాటాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. షేక్ సలాంబాబుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా అభినందనలు తెలిపారు. మంగళవారం అమరావతిలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు.