telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కూరగాయలు విక్రయిస్తున్న సాఫ్ట్ వేర్ శారద..స్పందించిన ఎంపీ

sharada software

కరోనా విజృంభించడంతో ఎన్నో సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో చాలామంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక అనేకమంది అలమటిస్తున్నారు. అయితే, వేలల్లో జీతం అందుకుంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా ఎంతో గౌరవం పొందిన శారద అనే అమ్మాయి లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినా కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న వైనం పలువురిని ఆకర్షించింది.

వరంగల్ పట్టణానికి చెందిన శారద ఢిల్లీలో రెండేళ్లపాటు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చెంసింది. ఇటీవలే హైదరాబాదులోని మరో సంస్థలో చేరింది. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడంతో చాలామంది ఉద్యోగుల తరహాలోనే శారద కూడా ఉద్యోగం కోల్పోయింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఉద్యోగం పోయిందని నిరుత్సాహపడకుండా శారద తన స్వస్థలానికి చేరుకుని తలిదండ్రులకు సాయంగా కూరగాయలు అమ్ముతూ ఉపాధి కల్పించుకుంది.

శారద కథనాన్ని ఓ తెలుగు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి స్థానిక పార్టీల వరకు ప్రతి ఒక్కరూ స్పందించారు.దీనిపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా మాట్లాడారు. ఆమె కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని, త్వరలోనే శారద కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. కష్టపడి పనిచేయాలన్నది శారద తత్వమని ఆమె చర్యల ద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు.

Related posts