దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది. 950 కోట్ల స్కాంలో లాలూను దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు.
25 ఏళ్ల తర్వాత లాలూప్రసాద్ యాదవ్ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పునిచ్చింది. దాణా కుంభకోణంలోని మరో నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ ప్రసాద్ చివరి ఐదో కేసులోనూ దోషిగా తేలారు. ఈ కేసులో మరో 36 మందికి మూడేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది సీబీఐ స్పెషల్ కోర్టు.
1996లో తొలిసారి దొరండా ట్రెజరీ కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 55 మంది ఇప్పటికే మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు.
చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. మంగళవారం లాలూను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది.