అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. తను సూచించిన సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయలేదన్న రేవంత్… ఫిర్యాదు స్వరూపాన్ని మార్చారని పేర్కొన్నారు.
సెక్షన్ 504 నమోదు చేశారని.. ఈ ఎఫ్ఐఆర్ ను చూసిన తర్వాత తిరిగి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నారు. అందుకే తాను దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ ఎఫ్ఐఆర్ ను చూస్తే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని…మొన్న ఫిర్యాదు చేస్తే ఇవాళ ఉదయం వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెక్షన్ 509 ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాను ముందుగానే తాము ఇచ్చిన ఫిర్యాదులపై 48 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరామని చెప్పారు.
ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు చూపించాలి. వ్యవస్థపై దాడి జరిగితే ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. జాతీయ స్థాయి మహిళా నేతను అవమానించేలా అసోం సీఎం మాట్లాడారు…అందుకే నామమాత్రపు కేసు నమోదు చేస్తే ఊరుకునేది లేదు. మేం ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని అన్నారు.