పీవీ మార్గ్లో 330 రెండు పడక గదుల నిర్మాణం పూర్తి చేయగా లాటరీ పద్ధతిలో పేదలకు ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. పీవీ మార్గ్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వర్షం చినుకుపడితే వణికి పోయే పేదలకు కోటి రూపాయల విలువైన ఇల్లు ఉచితంగా పంపిణీ చేసి భరోసా కల్పించామన్నారు. 26 షాపుల అద్దెలతోనే అపార్టుమెంటు నిర్వహణ ఖర్చులు వస్తాయని చెప్పారు. ‘ఇల్లు గట్టుడు.. పెళ్లి చేసుడు’ బాధ్యతలను పేదలపై భారం పడకుండా సీఎం కేసీఆర్ తీసుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఏ మెట్రోనగరాల్లోనూ ఈ విధంగా ఉచితంగా పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వడం లేదని కేటీఆర్ చెప్పారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం కొంత ఆలస్యమైనా, పూర్తి ఉచితంగా పేదలకు గూడు కల్పించడం సంతోషంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొందరు కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైందని మంత్రి తలసాని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణం కోసం కేవలం 30శాతం మాత్రమే రాయితీ ఇచ్చేవారని, ఇప్పుడు పూర్తి ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నామని వివరించారు.
next post