telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో పీవీ పేరుతో జిల్లా ప్రకటించనున్న కేసీఆర్…?

తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈనెల పీవీ వందో జయంతి జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు కానుంది. దేశానికి ఆర్థిక పితామహుడు, బహుభాషా కోవిదుడు, అపర చాణుక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 28న ఆయన పీవీ శత జయంతి . ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరును చిరస్థాయిలో నిలిపేందుకు సిద్ధమవుతోంది. పీవీ పేరుతో జిల్లా ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఏడాది పాటుగా పీవీ శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పీవీకి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో కొత్తగా హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని హుస్నాబాద్, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు చెందిన అఖిలపక్ష నేతలు గతంలో హైపవర్‌ కమిటీకి ప్రతిపాదించారు.

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఆరు, హుజూరాబాద్‌లో నాలుగు మండలాలున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఇల్లందకుంట, హుస్నాబాద్‌రూరల్‌ మండలాలు కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపితే 12 మండలాలు అవుతున్నాయి. హుజూరాబాద్‌కు సమీపంలోనే ఉన్న శంకరపట్నం మండలాన్ని పీవీ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. హుజురాబాద్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర.. పీవీ నరసింహరావు స్వగ్రామం. సమీపంలోనే ఉన్న హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి వరంగల్ అర్బన్ జిల్లాలో చేర్చిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌తో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, చిగురుమామిడి మండలాలను కలుపుతూ పీవీ జిల్లా ఏర్పాటు చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అటు పీవీ నరసింహరావును సముచితంగా గౌరవించుకున్నట్టుగా ఉండటంతో పాటు రవాణా సౌకర్యం విషయంలోనూ సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts