ఏపీలో నేడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేకహోదా భరోసా యాత్రలో ఉన్న కాంగ్రెస్ వర్గాలలో రాహుల్ ఉత్సాహాన్ని నింపుతూ, నేడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బయలు దేరి 11:50 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12:40 గంటలకు తిరుమలకు బయలుదేరి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్కు చేరుకుని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
2:20 గంటలకు శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్ నుంచి బయలు దేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్కు చేరుకుంటారు. అక్కడి నుంచి తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర చేస్తారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత తిరుపతి విమానాశ్రయంకు చేరుకుని 4:35 గంటలకు తిరిగి ఢిల్లీ బయలు దేరి వెళతారు.