ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతిలో మూడో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. . జీఎన్ రావు కమిటీ నివేదికపై రైతులు మండిపడుతున్నారు. ఈ రోజు ఉదయం రోడ్లపైకి వచ్చిన మందడం రైతులు అడ్డంగా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుపై సిమెంటు బెంచీలు, కరెంట్ స్తంభాలు అడ్డం పెట్టారు.
మరోవైపు రోడ్డుపై రైతులు టైర్లు తగలబెట్టారు. సీఎం ఫ్లెక్సీలను చించివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.