కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ. ..సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.‘‘దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా, అప్రజాస్వామిక విధానంలో మోదీ పాలన కొనసాగుతోందని, మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాల్ని వ్యతిరేకిస్తూ, మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ బంద్ కొనసాగిస్తున్నారు.
రైతుల నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ నరేంద్ర మోదీ సర్కార్ దోపిడీ విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. రైతులు అహింసా మార్గంలో సత్యాగ్రహం సాగిస్తుంటే ఈ దోపిడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఈరోజు భారత్ బంద్ చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం వంచనకు పాల్పడుతూనే ఉన్నందున రైతులు ఈరోజు భారత్ బంద్కు దిగారని పేర్కొన్నారు. ఆందోళన చేపట్టిన అన్నదాతలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనాలని రాహల్ కోరారు.