తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పై కరీంనగర్ బేజేపీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కు దమ్ముంటే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలని సవాల్ విసిరారు. పార్టీలో ఎప్పటి నుంచో అసంతృప్తి మెుదలైందని అది రాబోయే రోజుల్లో మరింత బయటపడుతుందని తెలిపారు. రాజీనామా చేస్తే ప్రజలు అండగా ఉంటారని సంజయ్ అన్నారు.
మిడ్ మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్న సంజయ్ కేసీఆర్ కు చింతమడకపై ఉన్న ప్రేమ ముంపు గ్రామాలపై లేదని చెప్పుకొచ్చారు. ముంపు గ్రామాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్కు వేములవాడ రాజరాజేశ్వరస్వామి శాపం తగులుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజలు రాళ్లతో కొట్టేరోజు వస్తుందని చెప్పారు. ఇన్నాళ్లు చనిపోయినా పర్వాలేదనుకున్నాం..ఇకపై చంపేందుకైనా సిద్ధమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.