*అన్పార్లమెంటరీ వర్డ్స్ రిలీజ్ చేసిన పార్లమెంట్
*నేతలు మాటలు అదుపు తప్పితే ..శిక్షే
*నిషేదిత పదాలు లేవంటూ లోక్సభ స్పీకర్ క్లారిటీ..
*దాదాపు 65 పదాలు అసభ్య పదాలని గుర్తింపు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కీలక నిర్ణయం వెలువడింది. పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు లేదా మతపరమైన వేడుకలు నిర్వహించ రాదని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
జులై 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో .. ఇప్పటికే లోక్సభ నిషేధిత పదాల జాబితాను విడుదల చేసింది. వాటిలో అవినీతిపరుడు, సిగ్గుచేటు, డ్రామా, జుమ్లాజీవి, పిరికివాడు, చీకటి రోజులు, అహంకారి వంటి పలు పదాలను వాడకూడదని పేర్కొంది.
అయితే పదాల జాబితాపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. ‘విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాపై నిషేధం’ జూలై 14న జారీ చేసిన సర్క్యులర్ కాపీని పంచుకున్నారు.
మరోవైపు రాజ్యసభ సెక్రటరీ చేసిన ప్రకటనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి పరిమితులు విధించలేదని.. స్పీకర్ వద్ద నుంచి తమకు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో రేపు అన్ని రాజకీయ పార్టీల నేతల కూర్చుని చర్చిస్తామని ఆయన తెలిపారు