వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు ప్రాంతాలను సమానంగా చూశారని ఆయన ఆశయాల కోసం తెలంగాణలో పని చేస్తామని వైఎస్ షర్మిల చెప్పారని ఓ ఛానల్ కి ఇంటర్వూలో వెల్లడించింది. వైఎస్సార్ ఎప్పుడూ ఈ ప్రాంతం… ఆ ప్రాంతం అని చూడలేదు. తెలంగాణ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొంటారన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కనుక కచ్చితంగా మా పార్టీకి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదని అన్నారు.
అక్టోబర్లో తెలంగాణలో పాదయాత్ర చేపడతా. ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటాం. కేటీఆర్ ఎవరు అనడం ఎటకారం మాత్రమే అని వైఎస్ షర్మిల తెలిపారు.ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్… పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్ సప్లయింగ్ కంపెనీ’గా మారింది. కేసీఆర్కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్. అది ప్రతిపక్షమెలా అవుతుంది? బీజేపీ అంటారా..! బండి సంజయ్ గారేమో కేసీఆర్ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు. రేవంత్రెడ్డి గారు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్. రేవంత్రెడ్డి గారి పిలక కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు… మెడ తీసేయగలడు.
ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదు నాది. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయం.”వైఎస్ జగన్తో వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే… రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్మోహన్రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను.
పాదయాత్రతో సహా. ..ఏ సంబంధం ఉందని చేశాను? రక్తసంబంధం ఉందని, నా బాధ్యత అనుకుని చేశాను. అలాంటిది ఒక్క మాటలో ‘సంబంధం లేదు’ అనేశారు. విభేదాలు ఎవరికి ఉండవన్నా! మీరు పది మందిని పిలిచి ‘మీ తోబుట్టువులతో విభేదాలున్నాయా’ అని అడగండి. పదికి పదిమంది విభేదాలు ఉన్నాయనే చెబుతారు. కానీ విభేదాలున్నాయి కదా అని ‘సంబంధాలు లేవు’ అనుకోవడం నాకు నచ్చలేదు. బాధేసింది’’ అని షర్మిల చెప్పినట్లు పేర్కొంది.
నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయం: అసదుద్దీన్