*కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన పీవీ సింధు
*కామన్వెల్త్ గేమ్స్లో తెలుగు బిడ్డ చరిత్ర సృష్టించింది
*ఉమెన్ సింగిల్స్లో బంగార పతకం సాధించిన సింధు
*తొలిసారిగా సింగిల్స్లో స్వర్ణం గెలిచిన సింధు
తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి పతకం గెలిచి మరో ప్రతిష్టాత్మక టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. బర్మింగ్హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్ లిపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది.
కోర్టులో అడుగుపెట్టిన క్షణం నుంచే పీవీ సింధు దూకుడుగా ఆడింది. తొలి గేమ్లో 9-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వరుస పాయింట్లతో 14-8తో పై చేయి సాధించింది. ఈ క్రమంలో మిచెల్ 20 షాట్ల ర్యాలీతో ఆమెను నిలువరించే ప్రయత్నం చేసింది. అయినా సింధూ 16-12తో ముందుకెళ్లింది. 18-15తో గేమ్పాయింట్కు వచ్చేసింది. 21-15తో గెలిచేసింది. రెండో గేమ్లోనూ తెలుగు తేజమే 3-2తో ముందంజ వేసింది. బేస్లైన్ వద్ద ఆడుతూ 7-3తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. 11-6తో విరామం తీసుకుంది. లీ వరుస తప్పిదాలు చేయడంతో 19-13తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 21-13తో గేమ్తో పాటు మ్యాచ్ గెలిచేసింది.
కాగా, కామన్వెల్త్ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది.
ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు కైవసం చేసుకుంది.. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.