రాజ్కోట్లో రోహిత్ శివమెత్తడంతో బంగ్లాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఏకపక్షంగా మారింది. కానీ, రాజ్కోట్లో రిషభ్ పంత్, శిఖర్ ధావన్, ఖలీల్ అహ్మద్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తుంది. వికెట్ల వెనుక, బ్యాటింగ్లో విఫలమవుతున్న పంత్పై ఒత్తిడి పెరిగింది. జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే మూడో టీ20లో అతడు అదరగొట్టాల్సి ఉంది. బ్యాటుతో పాటు కీపింగ్లోనూ అతడు రాణించాల్సి ఉంది. తొలి రెండు టీ20ల్లో ధావన్ 41, 31 పరుగులతో ఫర్వాలేదనపిస్తున్నా దూకుడుగా ఆడలేకపోతున్నాడు. నిదానంగా ఆడుతుండటంతో అతడి ఫామ్పై సందేహాలు తలెత్తుతున్నాయి. పొట్టిఫార్మాట్లో గబ్బర్ మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. పేసర్ అహ్మద్ మరోసారి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆఖరి టీ20లో ఖలీల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్కు అవకాశం లభించవచ్చు.
గత కొంత కాలంగా టీ20ల్లో కొనసాగుతున్న ఆల్రౌండర్ కృనాల్ పాండ్య బంతితో మెరవాల్సి ఉంది. తొలి టీ20లో బ్యాట్ ఝుళిపించిన అతడు బౌలింగ్లో తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మరో యువఆల్రౌండర్ దూబేకు ఎక్కువ అవకాశాలు రాలేదు. తొలి మ్యాచ్ బ్యాటింగ్లో తడబడిన అతడికి రెండో టీ20లో బ్యాటు పట్టే అవకాశం రాలేదు. ఈ సిరీస్లో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. మిడిల్ ఓవర్లలో వికెట్ల పడగొడుతూ బంగ్లాను దెబ్బ తీస్తున్నాడు. అతడికి అండగా సుందర్ ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్మెన్కు సవాళ్లు విసరలేకపోతున్నాడు. ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన మనీశ్ పాండే, సంజు శాంసన్, రాహుల్ చాహర్కు ఆఖరి టీ20లో చోటు దక్కే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వారికి అవకాశం లభించకపోతే వచ్చే నెలలో స్వదేశంలో జరగనున్న వెస్టిండీస్ సిరీస్లో ఆడించే అవకాశం ఉంది.