మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీకి వింత అనుభవం ఎదురయింది. ఆమె కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొందరు బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ.. మోదీ అని గట్టిగా అరుస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సాయంతో కారు దిగిన ప్రియాంక వారి వద్దకు నేరుగా వెళ్లారు. దీంతో బీజేపీ కార్యకర్తలతో ప్రియాంక గొడవ పెట్టుకుంటారని అందరూ భావించారు.
అయితే అనూహ్యంగా ప్రియాంకా గాంధీ నవ్వుతూ బీజేపీ కార్యకర్తలను పలకరించారు. వారందరితో కరచాలనం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రియాంక వారిని కోప్పడి ఉంటే కాంగ్రెస్ శ్రేణులు సదరు బీజేపీ కార్యకర్తలను చితక్కొట్టేవారనీ, కానీ ప్రియాంక సహనంతో వ్యవహరించారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ రాజకీయాల్లో ఒకే కులానికే ప్రాధాన్యత: శివరాజ్ సింగ్ చౌహాన్