రామాయణం, మహాభారతాల పౌరాణిక సీరియళ్లును దూరదర్శన్ పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో ఆ ఛానెల్ టీఆర్పీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రైవేటు ఛానెళ్లకు పోటీగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సీరియల్ రేపటి నుంచే ప్రసారమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు ప్రకటించారు.
‘డీడీ నేషనల్లో ప్రసారమైన పాప్యులర్ సీరియళ్లలో ఒకటైన శ్రీకృష్ణను రేపటి నుంచి ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నాం’ అని జవదేకర్ ట్విట్టర్లో వెల్లడించారు. రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్లో ప్రసారమైంది. ఆ తరువాత 1999లో జీ టీవీలో, అనంతరం 2001 లో సోనీ, స్టార్ వంటి చానెళ్లలోనూ ఈ సీరియల్ ప్రసారమైంది. రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లు డీడీ నేషనల్లో రికార్డు స్థాయిలో రేటింగ్స్ సాధిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీకృష్ణకు కూడా అదే స్థాయిలో ఆదరణ వస్తుందని భావిస్తున్నారు.