టాలీవుడ్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినీ ప్రముఖులు దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ తదితరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ..‘ఆన్లైన్ టికెంటింగ్ విధానంపై సినీ పరిశ్రమ సానుకూలంగా ఉంది. చిరంజీవి నాతో మాట్లాడారు.
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమకి సంబంధం లేదని చెప్పారు’ అని పేర్ని నాని తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు. సినిమా టికెట్ల రేట్లు పెంచమని మేమే కోరాం. దాని గురించి గత సమావేశంలో చర్చించాం. మంత్రి నాని సానుకూలంగా స్పందించారు. దాన్ని పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమకి వివరించలేకపోయాం. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.